Monday 14 November 2016

జ్వాలాతోరణం

సర్వ పాపహరం..
నరక బాధా విముక్తి కారకం..
జ్వాలాతోరణం


సాగర మథనం సమయంలో పాలకడలి నుంచి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలిపుతాడు. అయితే ఆలాహలం మంటలకు శివునికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజసిద్దమైన బేలతనం వల్ల భయపడుతుంది. తన భర్తకు ఆలాహలం మంటలు వల్ల ఏమీ కాకుండా వుండాలని దానికి ప్రతిగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాలాతోరణం దాటుతానని అగ్నిదేవునికి మొక్కుకుంటుంది. శివునికి ఏమీ కాలేదు. ఈ కారణంగా ప్రతి కార్తిక పౌర్ణమి రోజునా పరమేష్టి పరమశివుని సహా జ్వాలాతోరణం దాటుతుంది
ఈ తోరణాన్ని కొత్తగడ్డితో చేస్తారు. కొత్త గోగునారని తాడుగా పేని రెండు వేప చెట్లకు మధ్యగా తోరణంలా కడతారు. కొత్తగడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది. ఆ మంట ఆరేలోగా స్వామి వారిని మూడు మార్లు తోరణం కిందుగా తీసుకు వెళ్తారు.
భక్తులు ఈ జ్వాలతోరణం కిందిగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకం. కైలాస ద్వారం తెరుకుంటుందని చెబుతారు
అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాదెల్లో వేస్తారు. పశువులకు తినిపిస్తారు దీనివల్ల పాడి పంటలు సమృద్దిగా లభిస్తాయని నమ్ముతారు.
గడ్డి మండగా మిగిలిన నుశిని బొట్టులా పెట్టుకుంటారు. దీనివల్ల నరదిష్టి, భూత ప్రేతాత్మల పీడా వుండని నమ్మకం.
ఇది అంతా పెద్దలు చెప్పిందే దీనిలో తర్కానికి చోటు లేదు
పాటిస్తే వచ్చే నష్టమూ లేదు. కానీ తోరణం దాటేప్పుడు మెళకువగా లేకపోతే అగ్నిప్రమాదాలు జరగొచ్చు.
ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ వుంటుంది. స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందుగా తిప్పుతారు

-- సరిదే నాగ్
ఫోటోలు పాదగయా క్షేత్రం పిఠాపురం లో జ్వాలా తోరణం

-- సరిదే నాగ్

పాదగయా క్షేత్రంలో జ్వాలాతోరణం

Saturday 5 November 2016

బంతి .. బంతి పూల తోట

బుంగమూతి పూ బంతి..
పలుకనంటే ఎలా చెప్పుమరి..
క్రీగంటచూసి.. ఆశ రేపి..
ముడుచుకుంటే పాపమే సొగసరి

నీ తనువు బంగారం..
పలుకు కూడా బంగారమే..?
అర్భకుడిని తాళజాలనే..
కనులెదుట నిన్ను చూసి.. తాకకనే..

-- సరిదే నాగ్
ఫోటో : మాధవపురం బంతి పూల తోటలో

మునగాకు Drum stick leaves

ఈ రోజు

మునగాకు ఫ్రై..
దీనిలో  పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుందట..
 ఎ, సి, విటమిన్లు , ఇనుము, క్యాల్సియం , పొటాషియం, తదితరాలు సమృద్దిగా వుంటాయట.
మా ఇంటి దగ్గర్లో చాలా మునగ చెట్లు వున్నా ఎప్పుడూ తినలేదు
ఈరోజే మొదటి సారి తినడం
-- సరిదే నాగ్

Thursday 27 October 2016

kummari కుమ్మరి prameda


ఆ వేళ్లకు ఇంద్రజాలం తెలుసు..
మట్టి నుంచి కళాఖండాల్ని తీస్తోంది..
అతని చేయి తగిలిన మన్ను.. 
మురిసి మెలికలు తిరుగుతోంది.. 
కరిగి మృణ పుష్పంలా విరబూస్తోంది..
అతని చమటకు పరిమళం వుంది..
మట్టితో కలిసి గుభాళీస్తోంది..
గిర్రున తిరిగే 'సారె' అక్షయ పాత్ర అనుకుంటా..
ఎన్ని పాత్రలు సృష్టిస్తొందో.. 
మట్టి నుంచి అతను చక చకా ప్రమిదలు తీస్తుంటే..
నా కనులు ఆల్చిప్పలయ్యాయి..
మనిషిని చేసినోడు బ్రహ్మ అయితే..
మట్టిని ముంతచేసినోడూ బ్రహ్మే కథా..
----


 మట్టిప్రమిదల్లో నూనె దీపం మన సంప్రదాయం..
కుమ్మరి సారెపై చేసిన ప్రమిదలతోనే దివ్వెల పండుగ  చేసుకుందాం
చైనా మతాబులొద్దు.. కుండ చిచ్చుబుడ్డే వెలిగిద్దాం..
మన కళను బతికిద్దాం.. కుమ్మరన్నను కాపాడుకుందాం

-- సరిదే నాగ్
నోట్ : కాపీ చేయొద్దు, షేర్ చేసుకోవచ్చు

ఫోటో : మా


కుమ్మరి వీధిలో ప్రమిదలు, చిచ్చుబుడ్డి గుల్లలు చేస్తున్న కార్మికుడు

Tuesday 25 October 2016

cheeramenu చీరమేను చిరుమేను

గోదారి ప్రజలు.. కోనసీమ వాసులకు మాత్రమే ప్రకృతి ఇచ్చిన మరో వరం చీరమేను



సేమియాలా తెల్లగా పొడవుగా కనిపిస్తున్నవి చేపలు.
చేప పిల్లలు
వీటిని సేరుమేను, చీరమేను, చిరుమేను అని పిలుస్తారు.  
గోదావరి తీరంలోని ప్రజలకు మాత్రమే లభించే మరో మత్స్య సంపద ఈ చీరమేను.
ఇవి ఒక జాతి చేపల పిల్లలు. ఎక్కువగా గోదావరి ఎర్రనీరు వచ్చే సమయంలో ఈ చీరమేను లభిస్తుంది. దసరా నుంచి దీపాలవళీ వరకూ ఇవి లభిస్తాయి. 
మత్స్యకారులు వీటిని రంగుల చీరలు వలలా చేసి పట్టడం వల్ల వీటిని చీరమేనులు అంటారు. 
అతిచిన్న చేపలు కావడం వల్ల ఇవి సాదారణ వలలకు దొరకవు.
గుంపుగా వేలు లక్షల సంఖ్యలో సంచరించే చేపల్ని మత్స్యకారులు పట్టి అమ్ముతారు. 
అలాగే అతి చిన్న శరీరం కలిగి వున్నందున్న వీటిని చిరుమేను అని కూడా అంటారు. 
ఇంకో విశేషం వీటిని సోల, తవ్వా, శేరు లెక్కల్లో అమ్ముతారు. 
ఒక శేరు రూ. వేయి వరకూ పలుకుతోంది. శేరుల లెక్కన అమ్ముతారు కాబట్టి వీటిని శేరుమేను అని కూడా పిలుస్తారు. గతంలో కుంచం చీరమేను రూ.3వేలు వుండేది. 
పులసకు ఎంత ప్రాశస్త్యం వుందో గోదావరి తీరంలో చీరమేనుకూ అంతే డిమాండ్ వుంది 
క్యారేజీలు, బిందెలల్లో వీటిని తెచ్చి అమ్ముతారు. 
చీరమేనుతో మషాలా పెట్టి పిట్టు వండుతారు, గారెలు చేస్తారు. 
చాలా రుచిగా వుంటుంది.  దీనిని వండితే బాసుమతి బియ్యంతో బిరియానీ చేసినట్టుగా వుంటుంది. 
అంత రుచీ వుంటుంది.  గారెలైతే చెప్పక్కర్లేదు.. అద్భుతమైన రుచి. అందుకే అంత రేటు.
-- సరిదే నాగ్
ఫోటో : బిందె, బకెట్ల లో చీరమేను, సోల, తవ్వా లెక్కల్లో చీరమేను అమ్ముతున్న మత్య్సకార మహిళ
నోట్ : కాపీ చేయొద్దు, షేర్ చేసుకోవచ్చు

Saturday 22 October 2016

పసోడి నెత్తిన పచ్చగడ్డి బరువు

పసోడి నెత్తిన పచ్చగడ్డి బరువు
పశువు గిట్టలకింద ఆడి చదువు.
పొట్టకోయనక్కర్లేదు.. ఆడిపొట్టలేవు అక్షరాలు..
పాలికాపుతనమే ఆడి ఇంటికి ఆదరవు
ఊరికే అరుస్తాయి పేగులు ఆకలి అరుపు..
బలిసినోళ్ల బ్రహ్మ చెవుడు..
అందుకే వినిపించదు పిల్లోడి గోడు
నేతల నాలుకకు నరం లేదు..
చెప్పిందే చెబుతాయి అభ్యుదయం అబద్దాలు..
గ్రామ ప్రగతే దేశ ప్రగతి..
బాపూ చూడు ఈ బుడ్డోడి గతి
స్వరాజ్యమిచ్చి.. చక్కా పోయావు
సురాజ్యం కాస్తా అసురుల పాల్చేశావు
పెంటకుప్పలపై రేపటి బాలలు..
మెతుకులేరుతున్నారు చూడు
మహాత్మా మళ్లీ పుట్టొద్దు..
అసమర్థులు.. అయోగ్యుల చేతిలో దేశాన్ని పెట్టొద్దు..
మరోసారి ఆ తప్పు మళ్లీ చేయొద్దు..
-- సరిదే నాగ్
ఫోటో : కొత్తపల్లి మండలం రామ రాఘవపురం లో తీసింది

ఊరు 'చివరి' ఫోటోవు.. Sez village

ఊరు 'చివరి' ఫోటోవు..
అందరికీ ఎలా అర్థం అయినా..
నిజమైన అర్థం తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం రావివారి పోడు గ్రామస్తులకు మాత్రం ఖచ్చితంగా తెలుసు.
అవును ఇది ఆ ఊరి శివర తీసినదే..
కానీ ఇదే ఆ ఊరికి చివరి ఫోటోవు అయినా ఆశ్చర్యం లేదు
రావివారి పోడు సహా 14 గ్రామాల్లో భూములను ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తీసుకున్నారు
ఏకంగా 8వేల ఎకరాలను ప్రభుత్వం ఈ ప్రాంతంలో సేకరించింది.
(దేశంలో అతిపెద్ద భూ సేకరణల్లో ఇదొకటి)
సెజ్ ల లాభాలు.. నష్టాలు చర్చ పక్కన పెడితే..
సెజ్ ప్రభావిత గ్రామాల్లో ప్రథానమైనది రావివారి పోడు. ఇతర గ్రామాలు లానే త్వరలోనే ఈ గ్రామం కనుమరుగైనా ఆశ్చర్యం లేదు..
అప్పుడు ఈ చెట్టూ వుండదు..
చెట్టుకింది హనుమంతు..
చప్టామీద ముసలి ఒరుగులూ..
ఏవీ ఏవీ వుండవు
అప్పుడు ఈ ఫోటోవు చివరి ఫోటోవు కావొచ్చు..
-- సరిదే నాగ్
నోట్ : కాపీ చేయొద్దు.. షేర్ చేసుకోవచ్చు

Saturday 1 October 2016

eduru choopu ఎదురు చూపు

చాలా రోజులు.. కాదు కాదు చాలా సంవత్సరాలు విరామం తర్వాత నేను రాసిన  కథ
ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది..
కొంచెం ఓపిక చేసుకుని చదవండి.. అభిప్రాయం చెప్పండి..
మరో కథరాసే ఓపిక.. వస్తుంది

ధన్యవాదాలు
-- సరిదే నాగ్

 



Saturday 24 September 2016

గుజ్జగూళ్లు.. సైకతంలో రూపుదిద్దికున్న కలల సౌధం

చిన్ని చేతులు కట్టిన హార్మ్యాలు..
బుజ్జి మనసుకు తోచిన ఆర్కిటెక్చ్ లు
చిన్నారి చమటతో రూపుదిద్దికున్న ఆలయాలు..
తడి ఇసుకలో పూసిన పూలు..  గుజ్జగూళ్లు..

ఇసుక గుట్టలో చేయి పెట్టి.. 
మరోచేతిని తాపీగా చేసి..
నైపుణ్యం రంగరించి..
ఆటవిడుపుతో కట్టుకున్న పొదరిల్లు

చుట్టూ ప్రహరీ..
గోపురంలా నిలిచిన నిర్మాణం
ఆ పక్కనే పడక గది.. ఆ తర్వాత వంట గది..
ఇంటి ముందు వనం.. ఇంకా స్నానాల కుండీ..

చిట్టి మనసుకు తోచిన  స్వప్నం 
సైకతంలో  రూపుదిద్దికున్న కలల సౌధం
బుడతల కళ్లల్లో ఆనందం..
మయుడికి సైతం లేదు ఆ చేతుల నైపుణ్యం

ఓ భగవంతుడా.. ఓ వరమివ్వు..
నీకు చేతనైతే ఓ టైం మిషన్ నాకివ్వు..
 నన్నా వయసుకు వెళ్లనివ్వు..
అక్కడికెళ్లాక ఆ మిషన్ తగలబడిపోనివ్వు..
నన్ను అలానే వుండిపోనివ్వు.. కల్మష మెరుగని ఆ నవ్వు నాకివ్వు
 
-- సరిదే నాగ్
ఫోటో : రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో తీసింది.
చిత్రం ఏమిటంటే.. ఇదే గ్రౌండ్ లో ఓ పక్క బాక్సెట్ బాల్ ఆడుతున్నారు. మరో పక్క ఇంకొంత మంది పిల్లలు  వాలీబాల్.. ఈ ముగ్గురు స్నేహితులు మాత్రం శ్రద్దగా గుజ్జనగూళ్లు కడుతున్నారు. వాళ్ల ఆనందం శ్రద్ద చూసి నాకు ముచ్చటేసింది.. టైం మిషన్ లో దూరి వాళ్ల వయసుకు పారిపోవాలనిపించింది.. ఆ వయసుకు వెళ్లాక టైం మిషన్ పాడైపోవాలని భగవంతుడిని కోరుకోవాలనిపించింది..
ఈ దృశ్యం చూశాక నాకో నెల రోజులు ఆయుస్సు పెరిగినట్టనిపించింది..

నోట్ : నచ్చితే షేర్ చేయండి.. కానీ నా భావాలు కాపీ చేయొద్దు ప్లీజ్


Wednesday 21 September 2016

గోల్కొండ Golkonda port

ఆ మధ్య గోల్కొండ చూసినప్పుడు అక్కడ ఒక విషయం నాకు ఆసక్తి అనిపించింది
అవే శవ స్నాన వాటికలు.
కోట దిగువ భాగాన దక్షిణ దిశగా వాటిని నిర్మించారు. పర్షియన్ టర్కిష్ శైలిలో వీటి నిర్మాణం వుంది 
ఈ స్నాన గదులను రాజ కుటుంబంలో చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేయడానికి ముందు పవిత్ర స్నానం చేయించడానికి నిర్మించారుట.  ఈ గదులలో చల్లని, వేడి నీళ్లు ప్రవహించే స్నానపు తొట్టేలు ఏర్పాటు చేశారు. 
వాతావరణానికి అనుకూలంగా మృతదేహాలను వేడి, చల్లని నీళ్లతో స్నానం చేయించి అలంకరించేవారట.  
ఈ తొట్టేల్లోకి నీరు నేరుగా ప్రవహించడానికి ఏర్పాట్లు చేశారు. అదీ కన్ షీల్ద్ చేసిన పైపుల ద్వారా నీరు తొట్టెల్లోకి వచ్చే ఏర్పాటు ఆ రోజుల్లోనే చేయడం విశేషమే.
 ఈ స్నానపు గదులు అధునాతన సౌకర్యాలతో వుండటం ఆశ్చర్యం కలిగించింది.
గోల్కొండ నిర్మాణాల్లో ఇదో అద్భుత నిర్మాణంగా చెప్పొచ్చు. 

-- సరిదే నాగ్
ఫోటోలు:  గోల్కొండ కోట లోని శవ స్నాన గదులు 


Sunday 18 September 2016

Kolleru Birds _ Aatapaka_ Wsest Godavarai కొల్లేటి పక్షులు, ఆటపాక

సృష్టిలో అద్భుతాలకు కొదవలేదు.. 
అలాంటిదే కొల్లేటి అతిథి.. కొల్లేటి కొంగ
ఆస్ట్రేలియా, సైబీరియా దేశాల నుంచి ఈ కొంగలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో పశ్చిమగోదావరి జిల్లా కైకలూరు సమీపంలోని ఆటపాక బర్డ్ సాంచ్యురీకి వలస వస్తాయి..
అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇవి ఎగురుతూ గుంపులు గుంపులు గా వస్తాయి.
కొల్లేరు ప్రాంతంలో వీటి కోసం ప్రత్యేక గూళ్లు, ఏర్పాట్లు చేశారు. పక్షులు అక్కడే సుమారు ఆరు నెలలు పాటు కాపురం వుంటాయి. ఇక్కడే జత కట్టి.. గుడ్లు పెట్టి.. పొదిగి.. పిల్లలు అయ్యాక అవి ఎగరడం ఆరంభించగానే ఫిబ్రవరి, మార్చి నెలల్లో తిరిగి తమ దేశాలకు పిల్లలతో సహా వెళ్లిపోతాయి.
తిరిగి మరుసటి సంవత్సరం ఇదే సీజన్లో ఇక్కడికే వస్తాయి.
ఈ పక్షులు చాలా పెద్ద సైజులో వుంటాయి.. పొడవు ముక్కు గూడ కలిగి వుంటాయి. 
ఒక్కో పక్షి రోజుకు సుమారు 500 కి. మీ దూరం ప్రయాణిస్తాయట. అన్నీ ఒకేలా గుంపుగానే ప్రయాణిస్తాయి. 
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆస్ట్రేలియా నుంచి  కొల్లేరు చేరే లోగా ఎన్నో దేశాలు ఈ పక్షులు దాటుతాయి.. ఇంకా ఎన్నో కొలనులు, నదులు, అడవులపై నుంచి ఇవి ప్రయాణిస్తాయి.. అయినా అలవాటు ప్రతి సంవత్సరం ఈ కొల్లేరు ప్రాంతానికే అవి గుర్తుపెట్టుకుని రావడం. 
అలాగే పిల్లలా మారి వెళ్లిన పక్షి.. తిరిగి గుడ్లు పెట్టడానికి ఇక్కడికే రావడం ఎలా సాధ్యమో అంతుబట్టని వింతే..
ఇది కొన్ని వందల ఏళ్ల నుంచి సాగుతోందని కొల్లేటి వాసులు చెబుతున్నారు.
వేలాదిగా తరలి వచ్చే ఈ పక్షుల కోసం ఆటపాకలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పక్షులను వేటాడటం వాటి ఏకాంతానికి భంగం కలిగించడం నిషేదం.  
ఏమైనా ప్రకృతి అద్భుతాల్లో ఈ కొల్లేరు అతిథి మరో అద్భుతం.
కొల్లేరు సుమారు 77వేల ఎకరాలట. తొమ్మిది మండలాలు. అయితే పక్షులు మాత్రం ఈ ఆటపాక ప్రాంతంలోనే ఎక్కువ కనిపిస్తాయి.
ఇక మిగిలిన కొల్లేటిలో స్థానికంగా అరుదైన పక్షులు 
ఈ పక్షులకు కొల్లేరు పుట్టినిల్లుగా చెప్పొచ్చు.
హింధూ సంప్రదాయంలో మహిళ కాన్పు కోసం పుట్టింటికి వెళ్లినట్టే ఈ పక్షులూ పుట్టింటికి వస్తున్నాయేమో..!!!
-- సరిదే నాగ్
ఫోటో :








కొల్లేటి పక్షులు, ఆటపాక వద్ద తీసింది
నోట్ : నచ్చితే షేర్ చేయండి.. కాపీ మాత్రం చేయొద్దు

Sunday 4 September 2016

గొప్పోడివయ్యా సామీ..

గొప్పోడివయ్యా సామీ..
గరికకు పూజాధికారమిచ్చావు..
ఎలుకకు ఏనుగు బలమిచ్చావు..
చప్పిడి కుడుమును ప్రసాదం చేశావు
భలేవాడివయ్యా.. సామీ..
తలేమో ఓ రాక్షసుడు..
వాహనం ఇంకో రక్కసుడు..
నీ చుట్టూ గణాలు.. విఘ్నాలు..
అయినా తొలి పూజలందుకునే వేల్పువి..
ఎట్టాగయ్యా నిన్ను నమ్మేది..
.
తలెత్తి చంద్రుడిని చూసిన కృష్ణుడిని కూడా అపనిందల పాల్జేశావు..
పకపకలాడే చంద్రుడిని ఒంటిగాడిని చేసేశావ్
అయ్య మెడలో పామును నడుముకు చుట్టేసుకున్నావు
అమ్మా అయ్యా చుట్టూ తిరిగేసి.. తమ్ముడిని ఓడించేశావు..
గొప్పోడివయ్యా సామీ..
పశువులు తినే ఆకులు అలమలుతో పూజన్నావు
పళ్లూ కాయలతో పాలవెళ్లి కట్టించావు..
కథ మొత్తం చదవందే పూజ పూర్తి కాదని కిరికిరి పెట్టావు
చలిమిడి వడపప్పుతో సరిపెట్టుకుంటావు...
భలేవోడివయ్యా సామీ..
సిక్స్ ప్యాక్ ల కాలంలో.. ఫ్యామిలీ ప్యాక్ తో నువ్వు
వీధికో పది కుక్కలున్న మా మధ్య నీ ఎలకతో..
తొమ్మిది రోజులు ఎలా వుంటావయ్యా..
డ్రైనేజీ కంపు.. దోమల రొథ.. సినిమా పాటల భజన..
గంటకో పాలి పోయే కరెంటు.. వానా కాలంలోనూ ఉక్కపోత వెదరు
వీధి వీధినా బాసిమటం ఏసుకుని కూర్చుంటావ్..
తొమ్మిదో రోజున మురికి నీళ్లలో ముంచేస్తామని తెలిసీ ..
మామీద ప్రేమతో ఎలా వుంటావయ్యా..
అమాయకపు సామీ..
ముంచేస్తారని తెలిసీ అయిదేళ్లకో పాలి ఓట్లేసే మా అసుంటోడివే సుమా..
-- సరిదే నాగ్
నోట్ : ఏదో సరదాగా రాసింది సీరియస్ గా తీసుకోకండి.. అలాగే కాపీ కూడా చేయకండి..
ఫోటో : చంద్రగిరి మ్యూజియంలో తీసింది

Sunday 28 August 2016

చలం సమాధి arunachalam

 తెలుగుభాష, తెలుగు ప్రకృతి, ఉన్నన్నాళ్ళు చలం రచనలు ఉంటాయి.
 -- విశ్ఫనాథ సత్యనారాయణ
మహాప్రస్థానం ముందు మాటలో చలం అంటాడు(రు) "ఇదంతా.. చలం గొడవ.."ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి  శ్రీ శ్రీ అర్ణవంలో పడండి.." 

అరుణాచలం వెళ్లాను..
వెళ్లిన రోజే..  అరుణాచలేశుని దర్శనం చాలా సుళువుగానే అయ్యింది.. గిరిప్రదక్షిణ పూర్తి అయ్యింది అదే క్రమంలో  రమణ మహర్షి సమాధీ చూడగలిగాను..
అదేం చిత్రమో.. చలం సమాధిని కనుక్కోవడం కష్టమైపోయింది..
ఎవరిని అడిగినా సమాధానం లేదు..
రమణాశ్రమంలో సుమారు 30 ఏళ్ల పాటు ఆయన తన కుటుంబంతో జీవించారు కదా..
ఈ గాలిలో .. ఆయన శ్వాస.. ఈ నేలపై ఆయన స్పర్శ వుంటుంది కదా..
అందుకే..
చలం చివరి రోజులు గడిపిన రమణాశ్రమంలో అడిగి చూశాను..
 ఆశ్చర్యం పావలా సమాచారం కూడా దొరకలేదు.. 
"చలం గురించి ఇక్కడ ఏమీ లేదు.. మీరు వెదికినా దొరకదు.." అని తేల్చి చెప్పారు..
ఆశ్రమం పుస్తకాలు అమ్మే బాండాగారంలో తెలుగు తెల్సిన ఒకాయన వున్నారని తెల్సింది.. 
వీళ్లంతా తమిళం గోల.. తెలుగు ఆయనకు మన తెలుగు మహా రచయిత గురించి తెలిసే వుంటుంది.. ఎంతైనా తెలుగు వాడు కదా అని భావించి ఆయన దగ్గరికి వెళ్లాను..
ఆయన ఒకే మాట చెప్పారు.. రమణుల గురించి అడగండి ఎంతైనా చెబుతాను.. ఆ చలం గారి గురించి చెప్పడానికి. చూపించడానికి ఇక్కడ ఏమీ లేదు..
మీరు ఇంకా లోతుకు వెళ్తే ఆయన ఎవరూ అని కూడా అడుగుతారు ఇక్కడి వాళ్లు అని చెప్పారు..
అదేమిటీ.. చలం గారు ఇదే ఆశ్రమంలో గడిపారు కదా.. ఆయన వున్న గది.. ఆయన వాడిన వస్తువులు అలాంటివేవైనా వుండాలి కదా అని అడిగితే.. అదెప్పటి మాటండీ.. అవేవీ ఇప్పుడు లేవు..
ఎందరో వస్తుంటారు ఆశ్రమానికి అని సమాధానం వచ్చింది..
సరే ఆయన సమాధి ఎక్కడ వుందో అదైనా చెప్పండి అని ప్రాథేయపడ్డాను..
ఆయన సమాధి ఆశ్రమానికి అవతలి వైపున వుండాలండీ.. నేనూ చూడలేదు.. ఎవరో చెబితే విన్నాను.. నేను ఆశ్రమం వదిలి బయటికి వెళ్లను అందుకే కచ్చితంగా తెలీదు అని చెప్పారు..
నిజంగా నాకు కళ్లంటా నీళ్లు తిరిగాయి..
తెలుగు దేశాన్ని తన అక్షరంతో కదిలించిన రచయిత..
తన భావజాలంతో కరుడు కట్టిన సంప్రదాయాలను పెకలించిన సంస్కర్త..
మొక్కవోని అభిప్రాయాలతో ఎన్నో చర్చలు... వాదోపవాదాలకు తెరతీసిన మేథావి..
ఆయన గురించిన చిన్న సమాచారం కూడా ఇక్కడ దొరకడం లేదు..
సరే విచారంగా బయటికి వచ్చేశాను..
ఈ లోగా నేను అరుణాచలంలో వున్నానని ఎఫ్ బి లో పోస్టు ద్వారా తెలుసుకున్నమిత్రులు మణి భూషణ్ గారు మెస్సేజ్ పెట్టారు.. అరుణాచలంలో తనకు తెల్సిన వారిని కలిసి యోగక్షేమాలు తెలుసుకోమని.
సరే ఇక నాకు అరుణాచలం లో మరేదీ చూడాలన్న ఆసక్తి కనిపించలేదు.. మణిగారు ఇచ్చిన అడ్రస్ ఆథారంగా వారికి తెలిసిన వారి ఇంటికి వెళ్లాను.. అక్కడ చెప్పారు.. 
అరుణాచలంలో చలం గురించి ఎవరికీ ఏమీ తెలీదని.. తెల్సిన వాళ్ళు చాలా వరకూ చనిపోగా.. మిగిలిన వాళ్లు మరిచిపోయారని..
అంతా అక్కడ రమణ మయం అంతే..
సరే వారినే తరిచి తరిచి ప్రశ్నిస్తే చిన్న సమాచారం లభించింది.. రమణాశ్రమం రోడ్డు దాటి కొంత దూరం వెళ్తే వినాయకుడి గుడి వస్తుందని అక్కడే ఎక్కడో వుంటుందని చెప్పారు..
మళ్లీ ఆశ చిగురించింది..
నాతో వచ్చిన మిత్రులు రాలేమని చేతులెత్తేశారు.. ఒంటరిగానే బయలు దేరాను..
కొంత దూరం వెళ్లగానే వినాయకుని ఆలయం కనిపించింది.. అక్కడ పంతులు గారిని వచ్చీరాని హింధీలో అడిగాను చలంగారి సమాధి గురించి.. 
ఈలోగా అటు వెళ్తున్న ఒక యువకుడు ఆగాడు.. తెలుగులో అడిగాడు నన్ను చలంగారి సమాధా అండి.. నేను నిన్ననే చూశాను అదిగో ఎదురుగా కొంత దూరంలో  నిమ్మసోడా బండి కనిపిస్తుంది కదా.. అక్కడే వుంది చూడండి అని చెప్పాడు..
హమ్మయ్యా.. అని పరుగులాంటి నడతో అక్కడికి చేరుకున్నా..
మెయిన్ రోడ్డుకు పక్కనే తెల్లని సున్నం వేసి వున్నాయి రెండు సమాధులు..
ప్రశాంతంగా.. నిరాడంబరంగా.. చూట్టూ చిన్న పిట్టగోడ.. సమాధి మీద ఓ శివలింగం..
చూడగానే కళ్లంటా నీళ్లొచ్చాయి..
ఎన్నో మెదళ్లను కదిలించి.. ఎన్నో హృదయాలను కొల్లగొట్టిన మహా రచయిత..  సమాధి..
ఎన్నో విమర్శలు.. బహిష్కరణలు.. వెలి దండనలు ఎదుర్కొని.. సమాజాన్ని ధిక్కరించి నిలిచిన యోధుని చివరి మజిలీ..
చేతులతో తడిమాను.. చల్లగా.. స్పర్శనాడులను స్పందింప చేస్తూ..
కొంతసేపు అక్కడే నిలుచున్నాను..కూర్చున్నాను.. అటూ ఇటూ తిరిగాను..
అంతకు మించి ఏం చేయాలో తెలీలేదు..
అక్కడే నిమ్మసోడా అమ్మే అతను చెప్పాడు.. ఈ మధ్యనే గవర్నర్ రోశయ్య గారు అక్కడికి వచ్చారట..
చలం స్మారక మందిరం కట్టిస్తామని.. అరుణాచలంలొ ఆయన జ్ఞాపకాలు పదిల పరుస్తామని చెప్పారట.. అలా చెప్పే చాలా కాలం అయ్యిందట..  ప్చ్..

-- సరిదే నాగ్
ఫోటోలు : రుషి చలం, ఆయన థర్మపత్ని రంగనాయకమ్మ గార్ల సమాధి


Thursday 28 July 2016

తాటి రొట్టె

ఇప్పుడే మిత్రుడు తెచ్చాడు..
తాటికాయలు..
ఘుమ ఘుమలాడుతున్నాయి..
ఖచ్చితంగా మూడు టెంకలుంటాయి..
ఒక పండు కాల్చాలి..
మరి రెండు పాసం తీసి..
 బియ్యం నూక,
 కొబ్బరి కోరు,
 పచ్చిశనగ పప్పు
 బెల్లం వేసి రొట్టె కాల్చాలి..
ఆ కాల్చేప్పుడు రొట్టెపైన మూత మీద ఎర్రని నిప్పులు వేస్తే.. సమంగా కాలుతుంది..
ఆ పైన ఎర్రగా కాలిన మాడు తింటే తియ్యగా కర కరలాడుతూ భలే వుంటుంది..
కొన్ని వంటలకి గ్యాస్ స్టౌ నిషేదమబ్బా.. తప్పకుండా కట్టెల పొయ్యి అయితేనే బెటర్..
అన్నట్టు తాటి రొట్టె కూడా పులస పులస మాదిరే.. రాత్రి కాల్చి.. ఉదయం తినాలి ..
భలే వుంటుంది..

-- సరిదే నాగ్

Friday 22 July 2016

గిరి రాజ గోవులు..


గిరి రాజ గోవులు..
గో మూత్రంలో బంగారం వుందని ఇటీవల వార్తలొచ్చాయి.. ఈ ఆవు మూత్రం గురించే..
వీటిని గాదరాడ గ్రామం శివారు ఫాం హౌస్ లో చూశాను.
చాలానే వున్నాయి..
నిండు పొదుగుతో కళ్లకింపుగా వున్నాయి..
ఒక్కో ఆవు సుమారు 15 లీటర్ల పాలిస్తుందట..?
తువ్వాలు భలే అందంగా వున్నాయి..
మరో విషయం  ఈ ఆవులు అన్నీ ఇటుక రంగులో ఎర్రగా వున్నాయి..
వీటి చెవులు చాలా పొడవుగా పెద్దగా ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి..
అన్నీ భలంగా భలే వున్నాయి..
-- సరిదే నాగ్
ఫోటో : గాదరాడ శివారు తీసింది
నోట్ : నచ్చితే షేర్ చేయండి, కాపీ మాత్రం చేయొద్దు

Sunday 17 July 2016

రాములోరు సీతమ్మ వారు గోదారొడ్డున Badhrachalam


రాములోరు సీతమ్మ వారు గోదారొడ్డున ఇదిగో ఈ రాతి పల్లెం లోనే పళ్లు విప్ప పూవు తినేవారట.
భద్రాచలం పర్ణశాలకు కొంత దూరంలో
గోదాట్లో  స్వామి స్నానానంతరం నడుముకు చుట్టుకుని భుజానికి వేసుకునే ఉత్తరీయం పెట్టిన గుర్తులు అట
సీతమ్మ వారు ఆరేసుకున్న నార చీర గుర్తులు కూడా ఇక్కడ చూడొచ్చు.
ఇవన్నీ ఇక్కడి వాళ్లు చెప్పినవే..
-- సరిదే నాగ్
ఫోటోలు : భద్రాచలంలో తీసినవి
నోట్ : నచ్చితే షేర్ చేయండి, కాపీ మాత్రం వద్దు


1 min ·
ఇదిగిదిగో నా రాముడు
ఈడనె కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనె మురిపాలాడినాడు
ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
..

రచన : జె.కె.భారవి
చిత్రం : శ్రీరామదాసు (2006)






"ఏడేడు లోకాలు ఏలే పాదాలివే.."

"ఏడేడు లోకాలు ఏలే పాదాలివే.."
రామచండ్రుడు గోదారొడ్డున కూర్చున్న
రాతి సింహాసనం అట.
స్వామి పాదాలు గోదారి జలాల్లో..
ఈ సింహాసనం ను చూసి అంచనా వేయొచ్చు.. ఆజాను బాహుని రూపం.. పొడవు
-- సరిదే నాగ్
ఫోటో : భద్రాచలం పర్ణశాల సమీపం
నోట్ : నచ్చితే షేర్ చేయండి కాపీ మాత్రం చేయొద్దు

భద్రాచలం క్షేత్రంలో శూర్పణక ముక్కు చెవులు కోసిన స్థలం

పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు ఒక్కో ఆలయం వద్ద ఒక్కో ప్రత్యేకత వుంటుంది.
క్షేత్ర పురాణాన్ని బట్టి కూడా నమ్మకాలు  ఏర్పడతాయి.
భద్రాచలం క్షేత్రంలో ఇలాంటివి కొంచెం ఎక్కువే.
రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడే వనవాసం చేశాడనే నమ్మకం వల్ల ఆ ప్రత్యేకతలు వచ్చాయేమో.
ఈ ప్రాంతంలోనే రాముడు పర్ణశాలను నిర్మించుకున్నట్టు చెబుతారు.
ఇదిగో ఈ రాళ్ల గుట్టను చూడండి
ఇక్కడే తొలుత రాముని మోహించి.. ఆపై లక్ష్మణుని వద్దకు వచ్చిన శూర్పణకను  లక్ష్మణుడు ఇక్కడే ముక్కు చెవులు కోసి శిక్షించాడట.
ఇక్కడ చిన్న రాళ్ల గుట్టలోనివి మూడు రాళ్లు తీసుకుని ఏదైనా కోరిక కోరుకుని, రాముని వంటి కష్టాలు మనకు రాకూడదని ప్రార్థించి వెనుకకు తిరిగి ఎడమ చేతితో ఆ మూడు రాళ్లనూ ఈ గుట్టలో పడేలా విసరాలట.
ఇదో నమ్మకం.
ఇక్కడో సాధువు కూర్చుని వుంటాడు. రాళ్లు విసిరాక బొట్టు పెట్టుకుని దక్షణ వేసి రావాలి.
ఏమో ఏ నమ్మకంలో ఏముందో.. అంత దూరం వెళ్లాక చేయడం వచ్చే నష్టం అయితే లేదు కదా అని
నేనూ ఓ మూడు రాళ్లు విసిరాను
ఏం కోరుకున్నానో మాత్రం అడక్కండి..
చెప్పకూడదట.

-- సరిదే నాగ్
ఫోటో :
భద్రాచలం క్షేత్రంలో శూర్పణక ముక్కు చెవులు కోసిన స్థలం ఇదేనట.
నోట్ : నచ్చితే షేర్ చేయండి, కాపీ మాత్రం చేయొద్దు

Saturday 16 July 2016

శివుని తలపై గంగమ్మ Durgada

శివుని తలపై గంగమ్మ అందరికీ తెల్సినదే.
చిత్రపటాల్లో మినహా ఆ గంగమ్మ మనకు ఎక్కడా శివుని శిరస్సుపై కనిపించదు
కానీ మా పిఠాపురం దగ్గర గ్రామం దుర్గాడలో మాత్రం ఆ అద్భుతం గోచరిస్తుంది
ఇక్కడి శివ పంచాయతన సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వారి శిరస్సుపై కొలువు తీరిన గంగమ్మను చూడొచ్చు.
ఇక్కడ శివలింగంపై మరో శిల వుంటుంది. అదే గంగమ్మ
సుమారు 50 ఏళ్ల క్రితం దుర్గాడ ప్రాంతం అంతా కరువు కాటకాలతో వుండేదట.
సహజంగానే మెట్ట ప్రాంతం ఆపై వర్షాలు లేక పంటలు పండక ప్రజలు కష్టాలు పడేవారట.
ఆ సమయంలో ప్రస్తుతం ఈ శివలింగం ఆలయానికి ఎదురుగా గల కోనేటి లో లభించిందట. ఆ శివలింగంపై మరో రాయి వుండటం గ్రామస్తులు గమనించారు.
దైవజ్ఞులు, వేద పండితులు, గ్రామ పెద్దలు  ఆలోచించి శివాలయం నిర్మించారట
శివలింగంపై మరో రాయి శాస్త్ర సమ్మతం కానందున ఆ రాయిని కోనేటిలోనే వదిలేసి
శివలింగాన్ని మాత్రం ప్రతిష్టించారట. అయితే తెల్లారే సరికి చిత్రంగా ఆ శిల మళ్లీ శివలింగపైన అలాగే  వుందట. పురోహితులు ఆలోచించి ఆ రాయిని  దగ్గరలోని అన్నవరం పంపానదిలో నిమజ్జనం చేసి వచ్చారట. అయినా మళ్లీ రాయి శివలింగంపై ప్రత్యక్షం కావడంతో  పండితులు ఆ రాయి గంగాదేవిగా భావించి అలాగే వుంచి అభిషెకాలు నిర్వహించారట. శాస్త్ర రీత్యా..   సూర్యుడు, లక్ష్మీనారాయణుడు, ఉమా దేవి, గణపతి విగ్రహాలను ప్రతిష్టించి శివ పంచాయతన క్షేత్రం చేశారట.
అప్పటి నుంచీ గ్రామంలో కరువు దరి చేరలేదు. గ్రామంలో సుఖశాంతులు వెలసిల్లాయి. '
గ్రామస్తులే చందాలతో ఆలయాన్ని అభివృద్ది చేసారు.
ఇప్పటికీ ఆలయంలో శివలింగంపై మరో రాయి కనిపిస్తుంది
ప్రతి ఏటా తొలి ఏకాదశికి ఇక్కడ సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. గ్రామం మొత్తం ప్రతి గడప నుంచీ ఒక బిందెతో మహిళలు నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం నిర్వహిస్తారు.
ఎన్ని రాజకీయా పార్టీలు, విభేదాలు వున్నా శివాలయం విషయంలో గ్రామస్తులు అందరూ ఏకమవుతారు. తలో చేయి వేసి ప్రతి క్రతువూ ఘనంగా నిర్వహిస్తారు.
ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తులు ఆలయాన్ని చక్కగా అభివృద్ధి చేస్తున్నారు.
స్వామి వారిని వాళ్లు అలంకరించే తీరు ఆ శ్రద్ద అద్భుతం అనిపిస్తుంటుంది
ప్రతి విశేషమైన రోజునా వారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఆలయం వైపు రప్పిస్తారు.
ఈ క్రమంలోనే ఈ రోజు స్వామి వారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పండుగ వాతావరణం నెలకొంది
ధన్యవాదాలు
ఫోటోలు : దుర్గాడ సహస్ర ఘటాభిషేకం దృశ్యాలు
నోట్ : నచ్చితే షేర్ చేయండి కాపీ మాత్రం చేయొద్దు